రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. సొంతింటి కలను సాకారం చేయాలనుకుంటున్న పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా తీపి కబురు చెప్పింది. ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి దశ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం (ఏప్రిల్ 15) రోజు ఘనంగా ప్రారంభించారు.
శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మొదటి విడత చెక్కులను అందజేశారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారుల్లో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన తెలుగు లక్ష్మి అనే లబ్ధిదారురాలు ఈ పథకం కింద మొట్టమొదటి బిల్లు కింద లక్ష రూపాయల చెక్కును అందుకున్నారు. మరికొంతమంది అర్హులైన పేదలకు కూడా ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చొప్పున తొలి విడత ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో ఒక్కొక్క లబ్ధిదారునికి మొదటి విడతగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రూ.20.19 కోట్లు విడుదల చేసింది. బేస్మెంట్ నిర్మించుకున్న 2,019 మంది అకౌంట్లలోకి లక్ష రూపాయల చొప్పు డబ్బును ప్రభుత్వం జమ చేసింది. ఇందులో భాగంగానే.. 12 మందికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్వయంగా చెక్కులు అందించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఒక్కొక్క లబ్దిదారునికి ప్రభుత్వం మొత్తం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని పలు విడతల్లో అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే తొలి విడతగా లక్ష రూపాయలు అందజేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేదలు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఈ కీలకమైన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదల కల త్వరలోనే నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే.. తొలి దశలో అత్యంత నిరుపేదలు, నిజమైన అర్హులను గుర్తించి వారికి ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రారంభమైన చెక్కుల పంపిణీ కార్యక్రమం పేద వర్గాల ప్రజల్లో ఆనందాన్ని నింపింది. రానున్న రోజుల్లో మరిన్ని విడతల్లో అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa