హైదరాబాద్ నగరం త్వరలో అంతర్జాతీయ అందాల పోటీలకు వేదిక కానుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు మే 7వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దాదాపు 120 దేశాల నుండి 140 మందికి పైగా పోటీదారులు.. ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈసారి పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
విదేశీ అతిథులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పోటీల్లో పాల్గొనే అందాల భామలను రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. తొలుత 21 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని భావించినప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహబూబ్నగర్ జిల్లాలోని చారిత్రాత్మక పిల్లల మర్రిని కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో సందర్శించే ప్రాంతాల సంఖ్య 22కు చేరుకుంది. అలాగే.. తొలుత హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించాలని అనుకున్నప్పటికీ.. దాని స్థానంలో చారిత్రాత్మక వేయి స్తంభాల గుడిని చేర్చారు. మిగిలిన 20 పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు లేవని అధికారులు స్పష్టం చేశారు.
విమానాశ్రయంలో దిగినప్పటి నుండి అతిథులకు తెలంగాణ ఆతిథ్యం.. సంస్కృతిని పరిచయం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా బొట్టు పెట్టి, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలకడానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తోంది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి స్వయంగా విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్ల కోసం శంషాబాద్ పోలీసు అధికారులతో సమావేశమై సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అధికారులతో సమావేశమై.. అందాల పోటీల వేదికల వద్ద ఏర్పాట్లు.. విదేశీ అతిథుల బస, వసతి సౌకర్యాలు.. భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఏర్పాట్లను సమన్వయం చేసుకునేందుకు ప్రభుత్వం త్వరలో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈసారి మిస్ వరల్డ్ పోటీలు కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా.. తెలంగాణ గొప్ప సంస్కృతి, కళలు, పర్యాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదికగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa