ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలోని డల్లాస్ నగరంలో,,,, బీఆర్ఎస్ రజతోత్సవ సభ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 08:12 PM

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కేసీఆర్, ఆయన సతీమణి శోభతో పాటు కుటుంబ సభ్యులు అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. కేటీఆర్ కుమారుడు, కుమార్తె అమెరికాలో చదువుకుంటున్న క్రమంలో వారిని చూసేందుకు కేసీఆర్ దంపతులు మే 22 తర్వాత అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ కవిత కూడా ఈనెల 16 నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలో కవితకు సీబీఐ కోర్టు అనుమతి కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో.. పార్టీ మరో కీలక ప్రకటన చేసింది.


బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మేరకు జూన్ ఒకటో తేదీన డల్లాస్‌లోని DR పెప్పర్ అరేనాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఎన్నారై బీఆర్ఎస్ నాయకుడు మహేష్ బిగాల సోమవారం (మే 05న) రోజు స్పష్టం చేశారు.


డల్లాస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మహేష్ బిగాల తెలిపారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు మళ్లీ పదేళ్ల కిందటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిందని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. ఎల్కతుర్తి సభతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారనే విషయం స్పష్టమైందని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని ఆయన అన్నారు. ఎల్కతుర్తి సభకు కొనసాగింపుగా రాబోయే ఏడాది కాలంలో వివిధ దేశాల్లో బీఆర్ఎస్ సభలు నిర్వహిస్తామని మహేష్ బిగాల తెలిపారు. ముందుగా అమెరికాలోని డల్లాస్ నగరంలో డీఆర్ పెప్పర్ అరేనాలో జూన్ ఒకటో తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.


బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ మాట్లాడుతూ.. 2001 నుంచి బీఆర్ఎస్ వెంట నడుస్తున్నామని, బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెట్టడం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఈ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున వైభవంగా జరుపుతామని, వరంగల్ సభకు తీసిపోని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. పరాయి పాలనలో ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా ఉన్నదని, ఇప్పుడు కూడా పాలకులు తప్పు చేస్తే గాడిలో పెట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉద్యమం అన్నది జెండా ఊపిరిలోనే ఉన్నదని ఎల్కతుర్తి సభ మరోసారి రుజువు చేసిందన్నారు. ఈ వేడుకలకు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరానున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa