బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన అనంతరం చిట్ చాట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలు పూర్తి చేశానని.. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను మాత్రమే తాను చెబుతున్నానని, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానని అన్నారు. పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్న సమయంలో తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఆమె అన్నారు.
'నన్ను రెచ్చగొట్టకండి. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది చాలదా? ఇంకా నన్ను కష్టపెడతారా?' అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మేడే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. భౌగోళిక తెలంగాణ సాధించినా.. సామాజిక తెలంగాణ ఇంకా సాధించలేకపోయామని వ్యాఖ్యానించారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన న్యాయం, అవకాశాలు ఇంకా అందడం లేదని అన్నారు. సామాజిక అసమానతలు, వివక్ష ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక తెలంగాణ సాధన కోసం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కామెంట్స్ రాజకీయంగా బీఆర్ఎస్పై విమర్శలకు దారితీసింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో కవిత సొంత పార్టీ పాలనను విమర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కవిత వెల్లడించారు. పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేస్తున్నానని.. ప్రజల అభిప్రాయాలను మాత్రమే వెల్లడించానని స్పష్టం చేశారు. తాజాగా కవిత తనను రెచ్చగొట్టవద్దని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గతంగా ఏం జరుగుతోందనే చర్చకు దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్లో ఏం జరుగుతుందోననే చర్చ జోరందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa