సికింద్రాబాద్ రోడ్లపై సంచరించే పశువులను తొలగించడానికి హైదరాబాద్ ఉత్తర మండల ట్రాఫిక్ పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆదివారం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో చేపట్టిన ఈ కార్యక్రమం.. ప్రధాన రహదారులపై పశువులు తిరగడం వల్ల ప్రయాణికులు .. స్థానిక నివాసితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భద్రతా ప్రమాదాలపై వస్తున్న నిరంతర ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో.. బృందాలు రైల్వే స్టేషన్ సమీపంలో తిరుగుతున్న ఆవులు, ఎద్దులు, గేదెలను గుర్తించాయి. ఆ జంతువుల భద్రత .. శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాటిని జాగ్రత్తగా ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి, పశువుల శరణాలయాలకు తరలించారు. ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు పర్యవేక్షించారు.
వాహనాలపై వెళ్లే వాహనదారులకు, నడిచి వెళ్లే పాదచారులకు ఈ పశువులు ఇష్టానుసారం సంచరించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, నిన్న రెండు ఆవులను గుర్తించి, పశువుల శరణాలయాలకు సురక్షితంగా తరలించామన్నారు. ఈ సందర్భంగాఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ, ‘పశువుల యజమానులు తమ పశువులు రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులు రోడ్లపైకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు
ఎవరికైనా ఇలా పశువులు సంచరిస్తున్నట్లు తెలిస్తే, వెంటనే పోలీసులకు లేదా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తద్వారా తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ప్రజలు సహకరిస్తే, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలను పశువుల బెడద లేకుండా శుభ్రంగా ఉంచవచ్చు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే.. పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించకపోతే ఈ సమస్య మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి.. పశువుల యజమానులు తమ పశువులను అదుపులో ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa