తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ద్వారా మహిళా సంఘాలకు ఇప్పటికే 150 బస్సులను నడిపే హక్కును కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను కల్పించేందుకు త్వరలోనే మరో 600 బస్సులను మహిళా సంఘాలకే అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఇది మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు.
ఇక రూ. 500కే గ్యాస్ సిలిండర్లను అందించడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమని, పాఠశాలల నిర్వహణ బాధ్యతను కూడా వీరికే అప్పగించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని విద్యార్థులకు సరఫరా చేసే 1 కోటి 30 లక్షల యూనిఫారాల తయారీ బాధ్యతను కూడా మహిళలకే అప్పగించినట్లు తెలిపారు.
"కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లోనూ మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. వారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి, స్వయం సహాయ సమితుల ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వంగా కట్టుబడి ఉన్నాం," అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa