ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీటీ డబ్బులు వివాదంలో మహిళ వేలు కొరికిన చీటీదారుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 05:00 PM

హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చీటీ డబ్బులు, ఇంటి అద్దెకు సంబంధించిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసి, ఓ మహిళ తన చూపుడు వేలును కోల్పోయేలా చేసింది. ఓ వ్యక్తి కిరాతకంగా ఆమె వేలును కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే, జవహర్‌నగర్‌కు చెందిన సుజితకు మధురానగర్‌లో ఓ పెంట్‌హౌస్ ఉంది. ఆ ఇంట్లో మమత అనే మహిళ గత మూడేళ్లుగా అద్దెకు ఉంటోంది. ఇంటి యజమానురాలు సుజిత, తన దగ్గర అద్దెకుంటున్న మమత వద్ద చీటీలు వేసింది. ఈ క్రమంలో సుజిత, మమతకు సుమారు రూ.30 వేలు చీటీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. అయితే, కొద్ది రోజుల క్రితం మమత ఆ ఇంటిని ఖాళీ చేసి, తన స్నేహితురాలైన సుప్రియకు ఆ ఇంటిని అద్దెకు ఇప్పించింది. కానీ, వారం రోజులు తిరగకుండానే సుప్రియ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ ఇంటి అద్దె కూడా చెల్లించలేదు.ఈ నేపథ్యంలో, తనకు రావాల్సిన చీటీ డబ్బులు వసూలు చేసుకునేందుకు మమత తన భర్త హేమంత్‌తో కలిసి సుజిత ఇంటికి వెళ్లింది. అక్కడ, సుప్రియ చెల్లించకుండా వెళ్లిన ఇంటి అద్దె డబ్బును తమకు ఇవ్వాలంటూ సుజిత పట్టుబట్టింది. దీంతో ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెద్దది అవుతుండటంతో, సుజిత తల్లి లత (45) జోక్యం చేసుకుని వారిని ఆపే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన హేమంత్, అడ్డువచ్చిన లత కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికేశాడు. ఈ దాడిలో లత వేలు పూర్తిగా తెగి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావంతో, తెగిన వేలితో లత, ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే, తెగిపోయిన వేలును తిరిగి అతికించడం సాధ్యం కాదని వైద్యులు తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com