తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. వారి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నాలకు 500 రూపాయల బోనస్, పంటలకు మద్దతు ధర వంటి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా పాడి రైతులకు చాలా మేలు జరుగుతుంది అంటున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. ఇందిరా డెయిరీ పథకం కింద ప్రతి లబ్దిదారుడికి రెండు గేదెలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈక్రమంలో మంగళవారం మధిర క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఈ పథకం అమలు తీరుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి కీలక ప్రకటన చేశారు. ఇందిరా డెయిరీ పథకంలో భాగంగా లబ్ధిదారుడైన ప్రతి పాడి రైతుకు రెండు గేదెలు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం లబ్ధిదారులు.. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అలానే ఇందిరా డెయిరీ పథకం వర్తించాలంటే.. భూమి ఉండాలన్న నిబంధన ఏదీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంతేకాక, గేదెలు లేని వారికి ఇందిరా డెయిరీ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం.. పాడి రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాక.. వారి జీవనోపాధిని మెరుగుపరచడం అన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని భట్టి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో భాగంగా భట్టి విక్రమార్క.. అధికారులతో పథకం అమలు, లబ్ధిదారుల ఎంపికకు పాటించాల్సిన నియమాలు.. అలానే వారికి పంపిణీ చేసే గేదెలు వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. మరో ఐదు నెలల లోపు నియోజకవర్గం మొత్తం ఇందిరా డెయిరీ పథకం అమలు కావాలని భట్టి సూచించారు. ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేయాలని తెలిపారు. దీనిలో భాగంగా లబ్ధిదారులకు పంపిణీ చేసే గేదెల కొనుగోలు కోసం.. అధిక సంఖ్యలో అధికారుల బృందాలు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క కలెక్టర్ను ఆదేశించారు.
అలానే లబ్ధిదారులకు పంపిణీ చేసే గేదెలకు అవసరమైన పచ్చి గడ్డి, ఎండు గడ్డి వివరాలపై కూడా ఆయన ఆరా తీశారు. ఈ పథకాన్ని పారదర్శకంగా.. సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా డెయిరీ పథకం.. పాడి రైతులకు ఆదాయ కల్పనతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని భట్టి చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa