ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రావెల్ బ్యాగ్‌లో మహిళా మృతదేహం కేసులో వీడిన మిస్టరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 11:35 AM

హైదరాబాద్ నగర శివారు బాచుపల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి పడేసిన మహిళ మృతదేహం కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని, నిందితుడిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది నేపాల్ దేశానికి చెందిన ఓ యువకుడని, మరణించిన మహిళ కూడా అదే దేశానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతురాలి పేరు తారా బెహ‌రా (33), నిందితుడి పేరు విజ‌య్ తోఫా (30)గా తెలియ‌జేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... మే 23న నిందితుడు సదరు మహిళను హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని ఒక ట్రావెల్ బ్యాగ్‌లో కుక్కి బాచుపల్లి-మియాపూర్ రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూన్ 4న విజయదుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని రెడ్డిస్ ల్యాబ్ ప్రహరీ గోడ వద్ద ఉన్న ట్రావెల్ బ్యాగ్ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు మెరూన్ రంగు దుస్తులు ధరించి ఉందని, ఆమె వయసు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. "మృతదేహాన్ని సుమారు 10-15 రోజుల క్రితం ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి ఉంటారని భావిస్తున్నాం" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హత్య వేరే ప్రాంతంలో జరిగిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడవేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ కేసును ఛేదించేందుకు బాలానగర్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, కె. సురేశ్‌ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) ప్రాంతంలో నిందితుడు ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితుడికి మృతురాలితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోందని, అయితే ఈ సమాచారాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బుధవారం నాడు భారతీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa