తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యువత, క్రీడాకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారని మరోసారి రుజువైంది. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. వరంగల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించి.. వెంటనే అధికారులను విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
వరంగల్ క్రీడాభివృద్ధికి ఎమ్మెల్యేల కృషి..
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ వద్ద ఉన్న సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు నాణ్యమైన విద్య, క్రీడా ప్రోత్సాహం అందించడంలో సీఎం తీసుకుంటున్న చర్యలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికే అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారని.. కొందరు అర్జున, ద్రోణాచార్య అవార్డులు కూడా పొందారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రస్తుతం వరంగల్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మాత్రమే ఉందని.. అయితే అది పెరుగుతున్న జనాభా, క్రీడాకారుల అవసరాలను తీర్చలేకపోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. హనుమకొండ జిల్లాలో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటుతో పాటు.. ప్రత్యేకంగా ఒక క్రికెట్ స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దీనికోసం అవసరమైన 30 ఎకరాల KUDA భూమి ధర్మసాగర్ మండలం ఉన్నికిచెర్ల గ్రామంలో.. జాతీయ రహదారి 163కి ఆనుకుని అందుబాటులో ఉందని వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
వరంగల్ అభివృద్ధికి సీఎం హామీ..
వరంగల్ నగరం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా.. ఉత్తర తెలంగాణలో విద్యా, వైద్య, ఇంజనీరింగ్, నిట్, కాకతీయ యూనివర్సిటీ వంటి విద్యా కేంద్రాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. యువతలో క్రికెట్పై ఉన్న అపారమైన ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, వరంగల్లో ఒక ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందని వివరించారు. సీఎం ఇప్పటికే చేపడుతున్న నగర అభివృద్ధి చర్యలలో భాగంగా క్రికెట్ స్టేడియం మంజూరైతే, అది వరంగల్ నగరానికి ఒక మణిహారంగా మారుతుందని తెలిపారు.
ఎమ్మెల్యేల విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, తక్షణమే సంబంధిత శాఖ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడారు. వరంగల్లో క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, తగిన విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. వరంగల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని.. త్వరలోనే క్రీడా పాఠశాల, క్రికెట్ స్టేడియం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఈ హామీతో వరంగల్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లు వరంగల్ క్రీడా రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందించి, భవిష్యత్తులో అనేక మంది ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa