ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైగర్‌ కన్జర్వేషన్‌ జోన్‌ విషయంలో ఆలోచనలో పడిన ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 03:31 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్‌ కన్జర్వేషన్‌ జోన్‌ విషయంలో సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. సుమారు 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టైగర్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జీవో 49 విషయంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో కలెక్టర్‌ నుంచి సేకరించిన తాజా నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌, కర్జెల్లి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌ రేంజ్‌లో లక్షా 49 వేల హెక్టార్లను టైగర్‌ రిజర్వ్‌లోకి మారుస్తూ గత నెల 30న ప్రభుత్వం జీవో 49ని ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో 330 ప్రభావిత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సమగ్ర వివరాలను సేకరించారు. వాస్తవ పరిస్థితులను సీఎంకు వివరించారు. దీంతో జీవో 49ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, జీవో 49 నిలుపుదలపై హర్షం వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం సన్మానించారు. సహకరించిన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండాసురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కు.. ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa