ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సచివాలయానికి వెళ్లిన హరీష్ రావు, సీఎస్‌కు విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 07:48 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇక తమ విచారణకు సంబంధించిన నివేదికను.. కమిషన్ సభ్యులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై ఇటీవల కేబినెట్ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై కూలంకషంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తమకు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్.. ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు హరీష్ రావు, కేసీఆర్ వేర్వేరుగా.. కాళేశ్వరం ప్రాజెక్టు‌పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తయారు చేసిన రిపోర్టును అందించాలని లేఖలు ఇచ్చారు.


ఈ క్రమంలోనే శుక్రవారం రోజున మాజీ మంత్రి హరీష్ రావు.. స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నేతలతో కలిసి.. రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన పూర్తి రిపోర్ట్‌ను ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావును కోరారు. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసిన హరీష్ రావు.. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల రిపోర్టు పత్రాలను ఇవ్వాలని వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా లేఖలు ఇచ్చినట్లు రశీదులు కూడా తీసుకున్నారు.


కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కావాలని హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిశీలించి.. దానికి త్వరలోనే సమాధానం చెబుతామని సీఎస్ రామకృష్ణారావు చెప్పినట్లు తెలుస్తోంది. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సహా పార్టీ నాయకులు ఉన్నారు.


మరోవైపు.. ఇటీవల కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ సృష్టం చేసిన సంగతి తెలిసిందే. ఊరు, పేరు మార్చి.. ముందస్తు అంచనాలను మించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందని.. కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది.


ఈ నేపథ్యంలోనే కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టకముందే.. అందులో ఏం ఉందో తెలుసుకుని.. పరిశీలించాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ముందుగానే ఆ రిపోర్టును తీసుకుని.. కమిషన్‌ ఏం చెప్పిందనే విషయాలను అధ్యయనం చేయాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఇప్పటికే అనేకసార్లు బీఆర్‌ఎస్‌ చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa