ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదంలో సింగూరు ప్రాజెక్టు.. ఏ క్షణంలోనైనా గండి పడేందుకు అవకాశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 08:09 PM

రాజధాని హైదరాబాద్ నగరానికి తాగు నీరు.. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. ఆనకట్టకు వెంటనే మరమ్మతులు చేయకపోతే ఏ క్షణమైనా డ్యాం తెగిపోయే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ హెచ్చరికలు జారీ చేసింది. డ్యామ్ పైభాగంలో రాతి కట్టడం దెబ్బతిన్నదని.. దీనికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్యానెల్ సూచించింది. పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.


1976లో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులో సింగూరు రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభించారు. దీని సామర్థ్యం 29.91 టీఎంసీలు. 1989లో ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్ తాగునీటి కోసం దీని నుంచి 6.96 టీఎంసీలు కేటాయించారు. అలానే డ్యాం పరిసర ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు తీర్చడానికి, మంజీరా నదిలో పూడికను తగ్గించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించారు.


డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ) కింద సింగూరు ప్రాజెక్టు ఉంది. ఇదిలా ఉంటే చైర్మన్ అశోక్‌కుమార్ గంజు సారధ్యంలో ఆనకట్ట భద్రత సమీక్షా కమిటీ జూన్ 23న డ్యామ్‌ను పరిశీలించింది. ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ, వెంటనే చేపట్టాల్సిన మరమ్మతు పనులను తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.


వాస్తవానికి సింగూరు రిజర్వాయర్ డిజైన్ ప్రకారం దీనిలో 517.8 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయాలి. కానీ మిషన్ భగీరథ అవసరాల కోసం 520.50 మీటర్ల వరకు నీరు నిల్వ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు 2017 అక్టోబరు 30న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి కూడా సింగూరు రిజర్వాయర్‌లో అనుమతించిన 520 మీటర్లకు మించి.. 522 మీటర్ల కన్నా ఎక్కువగానే నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. దీనివల్లే జలాశయం దెబ్బతిన్నదని తేల్చింది. కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు అవకాశం లేకుండా పోయిందని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది.


దెబ్బతిన్న రాతి కట్టడాన్ని వెంటనే సరిచేయకపోతే ఆనకట్టుకు ఏ క్షణంలోనైనా గండి పడే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. ఒకవేళ అలా జరిగితే, దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ, నిజాంసాగర్‌తోపాటు చెక్‌డ్యామ్‌లు కూడా దెబ్బ తింటాయని పేర్కొంది. ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్టగోడకు నిలువునా చీలిక వచ్చిందని, ఒకవైపు గోడ వంగి ఉందని వివరించింది. కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయాలని అభిప్రాయపడింది. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి.. వర్షాకాలం అయిపోగానే మరమ్మతులు చేపట్టాలని కమిటీ సూచించింది. కట్ట మరమ్మతులకు అవసరమైన నిధులు డ్రిప్ నుంచి రాకపోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa