కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న వేళ.. తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు , మార్పు అంటూ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ఎర్రకోట నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ముందు కేంద్రానికి.. కేటీఆర్ బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) శ్లాబ్ రద్దు, జీఎస్టీ శ్లాబుల మార్పు చేస్తామని.. కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని.. అయితే నిజంగానే దేశంలో వస్తువుల ధరల తగ్గించాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తే.. అన్నింటికంటే ముందు చమురు ధరలు తగ్గించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే మిగిలిన వస్తువుల ధరలు అదుపులోకి వస్తాయని స్పష్టం చేశారు.
అదే సమయంలో చేనేతపై, ఔషధాలపై, బోధనా ఫీజులపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీని తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేతల సంక్షేమానికి తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని తెలిపారు. కానీ.. మోదీ సర్కార్ మాత్రం చేనేత వస్త్రాలపై మొదట 5 శాతం జీఎస్టీ విధించి.. దాన్ని ఆ తర్వాత 12 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. చేనేతపై జీఎస్టీ విధించడంపై అందరి కంటే ముందే తామే కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టినట్లు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత లక్షలాది మంది ఆధారపడిన చేనేత రంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాల్సింది పోయి పెంచుతారా అని మండిపడ్డారు. చేనేత వస్త్ర రంగం మాత్రమే కాదని.. అది భారత సాంస్కృతిక వారసత్వమని గుర్తు చేశారు. చేనేతపై పన్ను వేయడం అంటే మన సంస్కృతిని అవమానించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు.
ఒకవైపు నెల నెలా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రూపంలో దేశ ప్రజలపై భారం మోపుతూ.. జీఎస్టీ స్లాబ్ మార్పుతో తక్కువ సంఖ్యలో ధరలు తగ్గిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. మోదీ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే.. ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేటీఆర్ సూచించారు. చమురు ధరలు తగ్గితే రవాణా భారం తగ్గి.. దాదాపు అన్ని వస్తువుల ధరలు దిగి వస్తాయని వివరించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై పన్నులు తగ్గించి.. సెస్లను పూర్తిగా ఎత్తివేసి.. చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మోదీ సర్కార్కు హితవు పలికారు.
జీఎస్టీలోని 12 శాతం శ్లాబ్ను రద్దు చేసి.. సామాన్య ప్రజలకు మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది దేశ ప్రజలను మభ్యపెట్టే మరో అబద్ధపు హామీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. మొత్తం జీఎస్టీ ద్వారా రూ.22 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుండగా.. అందులో 12 శాతం శ్లాబ్ నుంచి వచ్చే వాటా కేవలం 5 శాతం మాత్రమేనని తెలిపారు. నామమాత్రపు వాటా ఉన్న 12 శ్లాబ్ను రద్దు చేసి.. అందులోని వస్తువులను వేరే శ్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలను ఉద్ధరిస్తున్నట్లు మోదీ సర్కార్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa