పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలుడు.. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని.. కోలుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప టీంతో పాటుగా.. అల్లు అర్జున్ కూడా బాలుడి వైద్యానికి, అతడి కుంటుంబానికి ఆర్థిక సాయం అందించారు. శ్రీతేజ్ను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీతేజ్కు మరో సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..
శ్రీతేజ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. బాలల హక్కుల కమిషన్ చొరవతో.. శ్రీతేజ్ కుటుంబానికి మిషన్ వాత్సల్య పథకం వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా శ్రీతేజ్ చెల్లెలికి నెలకు రూ.4 వేలు అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాలికకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు అందించనున్నారు. దీనిపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేస్తుంది.
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా 2024, డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రీమియర్ షో సందర్భంగా.. అల్లు అర్జున్... సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో.. తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన మూవీ టీం, హీరో బన్నీ.. శ్రీతేజ్ అండగా నిలిచారు. ఆర్థిక సాయం అందించారు. అలానే శ్రీతేజ్కు ఉచితంగా వైద్యం కూడా అందించారు. అలానే అల్లు అరవింద్ శ్రీతేజ్ వైద్య పరిస్థితి గురించి తరచుగా వాకబు చేస్తూ.. అతడి కుటుంబానికి అండగా నిలిచారు.
ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసిలాట సంఘటన తర్వాత అల్లు అర్జున్తో పాటుగా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పేపర్లు ఆలస్యం కావడంతో.. ఓ రోజు రాత్రి అంతా చంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అనంతరం దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. తొక్కిసలాట జరగడం దురదృష్టకర ఘటన అని.. శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలానే ఆసుత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సైతం పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa