ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో 78 వేల మందికి కొత్త రేషన్ కార్డులు,,,పరిశీలనలో మరో 85 వేల అఫ్లికేషన్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 04:54 PM

కొత్త రేషన్ కార్డులు అందజేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన కుటుంబాలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 78,294 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరో 85 వేల దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని.. వాటిని సర్కిల్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో ధృవీకరించి అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారని చెప్పారు. రేషన్ కార్డులు అందని వారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. పరిశీలన అనంతరం అర్హులైన వారందరికీ కార్డులు మజూరు చేయనున్నట్లు వెల్లడించారు.


కొత్తగా జారీ చేసిన కార్డుదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం, సరుకులు అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అన్ని కొత్త కార్డుల వివరాలు ఈ-పాస్ యంత్రాల్లో నమోదు పూర్తయ్యాయని.. కార్డుదారులు నేరుగా షాపులకు వెళ్లి బియ్యం పొందవచ్చునని తెలిపారు. వర్షాకాలం కారణంగా జూన్‌లోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగియడంతో సెప్టెంబర్ నెల కోటా పంపిణీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని రేషన్ షాపులకు స్టాక్ చేరిందని, మిగతా షాపులకు ఆగస్టు నెలాఖరు కల్లా సరఫరా పూర్తిచేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సారి హైదరాబాద్ జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీనివాస్ తెలిపారు.


ఇక రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం రేషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా రేషన్ కార్డుదారులకు ప్రత్యేక తెల్లటి చేతి సంచులు అందించే నిర్ణయం తీసుకుంది. ఈ సంచులు అభయహస్తం పథకం కింద డిజైన్ చేశారు. సంచులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలతో పాటు, ప్రభుత్వ ఆరు గ్యారెంటీల గుర్తులు ముద్రించారు. ప్రస్తుతం తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ఈ సంచులు చేరుతున్నాయి. వచ్చే నెల నుంచి రేషన్ డీలర్ల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ కోటా బియ్యంతో పాటుగా లబ్ధిదారులకు ఈ సంచులు ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa