బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. పొత్తు ప్రతిపాదనపై తమ పార్టీ బీహార్ నాయకత్వం ఇప్పటికే ఆర్జేడీని సంప్రదించిందని, ఇప్పుడు నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని ఆయన తెలిపారు. బీజేపీ, జేడీయూ కూటమిని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒవైసీ, బీహార్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే లౌకికవాదాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రతిపాదన చేశామన్నారు. "గతంలో మా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను మీ పార్టీ లాగేసుకున్నప్పటికీ, మేం పొత్తుకు ముందుకు వచ్చాం. మా బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాశారు" అని ఒవైసీ వివరించారు. తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. పొత్తులో భాగంగా తమకు ఆరు సీట్లు కేటాయించాలని కోరామని, గెలిస్తే మంత్రి పదవులు కాకుండా సీమాంచల్ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని మాత్రమే డిమాండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ కంచుకోట అయిన హైదరాబాద్లో పోటీ చేసేందుకు ఆర్జేడీని ఆహ్వానిస్తున్నట్లు కూడా ఒవైసీ తెలిపారు.ఇదే సమయంలో దేశంలోని పలు సమకాలీన అంశాలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా వేడుకల్లోకి ముస్లింల ప్రవేశాన్ని నిరాకరించడం ఒక రకమైన సామాజిక బహిష్కరణేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇటీవల కాన్పూర్లో 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్లపై చెలరేగిన వివాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. "ప్రేమను వ్యక్తం చేయడంలో తప్పేముంది? ఒకవేళ ఎవరైనా 'ఐ లవ్ మహదేవ్' అని రాస్తే దానితో కూడా సమస్య లేదు. అది వారి విశ్వాసం. కానీ ఇలాంటి చర్యల ద్వారా ముస్లింలను సామాజికంగా బహిష్కరించే ప్రయత్నం జరుగుతోంది" అని ఒవైసీ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa