తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నేడు తొలి పునాది రాయి వేశారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యాలయం 7.29 ఎకరాల భూమిపై, సుమారు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 20 కోట్ల వ్యయంతో నాలుగు నెలల్లో పూర్తవుతుంది. ఇది ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక కేంద్రంగా నిలిచే ఉద్దేశంతో, లేఅవుట్లు, పరిశ్రమల అనుమతులు, ప్రణాళికల మంజూరులో ప్రధాన పాత్ర పోషించనుంది.అదే సమయంలో, రావిర్యాల నుండి అమన్గల్ వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు, ఇది ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచనుంది.భారత్ ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో, 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలను కలుపుకొని విస్తరించనుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో, ఇది దేశంలో మొట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ సిటిగా రూపుదిద్దుకోనుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా యువతకు నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఫార్మా, హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు, వినోద సౌకర్యాలు, ఎకో టూరిజం జోన్ల కోసం ప్రపంచస్థాయి సంస్థలకు భూములను కేటాయించనున్నారు.ఈ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిక్సూచి కావడమే కాకుండా, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాష్ట్రాన్ని దేశానికి మార్గదర్శకంగా నిలిపే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa