ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఎక్కుతూ జారిపడి ఏఎస్సై మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 06:45 PM

పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డ్యూటీకి వెళ్లడం కోసం రైలు ఎక్కేందుకు స్టేషన్‌కి వచ్చిన ఏఎస్సై ప్రమాదవశాత్తు కాలు జారీ రైలు కింద పడ్డారు. ఈ విషాదకర సంఘటన తాండూరులో వెలుగు చూసింది. వికారాబాద్ రైల్వే ఎస్‌హెచ్ఓ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం చించోలి తాలూకా మర్పల్లికి చెందిన మారుతి అనే 49 సంవత్సరాల వ్యక్తి.. కలబురగి జిల్లా జేడీ హల్లి పీఎస్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు.


ఈక్రమంలో మారుతి మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లడం కోసం తాండూరు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. మంగళవారం రాత్రి 11 సమయంలో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో దురదృష్టవశాత్తు మారుతి కాలు జారీ రైలు కింద పడ్డారు. దీంతో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. మారుతి పడిపోవడం గమనించిన తోటి ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి.. ఆయనని ఆస్పత్రికి తరలించారు. రెండు కాళ్లు విరిగిపోవడంతో మారుతి స్పృహ తప్పారు.


వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మారుతిని ముందుగా తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈలోపు విషయం తెలుసుకున్న మారుతి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మారుతి కుటుంబసభ్యులు అతడిని కలబురగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మారుతి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్‌హెచ్‌వో తెలిపారు. మారుతి చనిపోవడంతో.. పండగ పూట వారి ఇంట తీవ్ర విషాదం నెలకొంది.


ఇదిలా ఉంటే పండగ పూట సొంత ఊళ్లకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో దసరా పెద్ద పండగ. దీంతో చాలా మంది సొంత ఊరికి పయనం అవుతారు. దసరా రద్దీని ద‌ృష్టిలో పెట్టుకుని.. రైల్వే శాఖ, తెలంగాణ ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ ఆర్టీసీ అయితే దసరా పండగ నేపథ్యంలో 8 వేల బస్సులను నడుపుతోంది. నేటితో రద్దీ ముగుస్తుందని అధికారులు భావిస్తున్నారు. పండగ తర్వాత శనివారం నుంచి మళ్లీ రద్దీ మొదలవుతుంది అంటున్నారు. పండగకు వేసిన ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను 50 శాతం పెంచారు. ఇక రైళ్లలో అయితే కాలు పెట్టే సందు లేకుండా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ప్రయాణాల వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa