ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 06:51 PM

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత కల్పించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఉన్నత విద్యారంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం.


ముఖ్య వివరాలు.. పరీక్ష విధానం..


అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుందని విశ్వవిద్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. TG-SET 2025 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్టు పద్ధతిలో జరుగుతాయి.


 డిసెంబర్ రెండో వారం నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంఈడీ తదితర) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ టెస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


TG-SET పరీక్ష మొత్తం 29 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు గంటల వ్యవధిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్).. ఇందులో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు.


పేపర్-2 (అభ్యర్థి పీజీ సబ్జెక్టు).. ఇందులో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఇది అభ్యర్థి ఎంచుకున్న సంబంధిత సబ్జెక్టుకు సంబంధించినది.


పరీక్ష నిర్వహించే ప్రధాన సబ్జెక్టులు: మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్, జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1).


పరీక్షా కేంద్రాలు..


టీజీ సెట్ పరీక్షను రాష్ట్రంలోని, పొరుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి తో పాటు విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ వంటి పట్టణాల్లో కూడా నిర్వహించనున్నారు. ఈ అర్హత పరీక్ష ద్వారా అభ్యర్థులు తమ సబ్జెక్టులలోని నైపుణ్యాన్ని నిరూపించుకోవచ్చు.


మరిన్ని వివరాలు, దరఖాస్తు తేదీల కోసం అభ్యర్థులు http://www.telanganaset.org/ లేదా www.osmania.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa