ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 గంటల్లోపే ఇందిరమ్మ క్యాంటీన్లు క్లోజ్,,,రెండో రోజే చాలా మందికి నిరాశ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 07:09 PM

హైదరాబాద్ నగరంలో నివాసం ఉండే పేదలు, రోజు వారి కూలీలకు తక్కువ ధరకే కడుపు నిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిచింది. మధ్యాహ్నం భోజనం, ఉదయం అల్పాహారం ఏదైనా సరే ఇక్కడ కేవలం 5 రూపాయలకే లభిస్తుంది. ఇప్పటికే మధ్యాహ్నం అందించే భోజనానికి మంచి ఆదరణ అభిస్తోంది. దీన్ని ద‌ృష్టిలో పెట్టుకున్న తెలంగాణ సర్కార్.. మధ్యాహ్నం భోజనం మాదిరే ఉదయం టిఫిన్ కూడా రూ.5కే అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను తెరిచారు. రెండు రోజుల క్రితమే వీటిని ప్రారంభించారు. పేదల కడుపు నింపడం కోసం తీసుకువచ్చిన ఈ క్యాంటీన్లు.. వారికి మాత్రం నిరాశనే మిగుల్చుతున్నాయి. పాపం పేదవారు టిఫిన్ కోసం ఇందిరమ్మ క్యాంటీన్ వద్దకు వచ్చి.. అయిపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. క్యాంటీన్లు ప్రారంభమైన రెండో రోజే ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం.


రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఇందిరమ్మ క్యాంటీన్లలో మొదటి రోజు పేదలకు నోరురించే టిఫిన్లు రుచి చూపించారు. అయితే అది ఒక్క రోజు సంబురంగానే నిలిచింది. తొలి రోజు వచ్చిన వారందరికీ టిఫిన్లు అందించిన ఇందిరమ్మ క్యాంటీన్లలో రెండో రోజు రివర్స్ సీన్ కనిపించింది. మంగళవారం కేవలం ఒక్క టిఫిన్ మాత్రమే వడ్డించగా.. అది కూడా కేవలం 150 మందకి మాత్రమే వడ్డించారు. ఆ తర్వాత మూసేశారు. దీంతో ఉదయం 9 గంటలలోపు వచ్చిన వారికి టిఫిన్ దొరక్కపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.


నగరంలోనే పలు ప్రాంతాల్లో రెండో రోజు ఇదే పరిస్థితి కనిపించింది. తక్కువ ధరకే టిఫిన్ చేద్దామని వచ్చిన వారు.. ఇందిరమ్మ క్యాంటీన్లు మూసి వేయడంతో నిరాశగా వెనుదిరిగారు. అయితే రోజుకు కనీసం రెండు టిఫిన్లు.. మధ్యాహ్నం భోజనంలో మరో కూర వడ్డిస్తే బాగుటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు.


ఈకార్యక్రమంలో భాగంగా తొలి దశలో నగరంలోని 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 29న ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 150 ఇందిరమ్మ క్యాంటీన్లకు ఈ పథకాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజు 25 వేల మందికి కేవలం రూ.5కే టిఫిన్‌ను అందించనున్నారు. ఈ క్యాంటీన్లు వారంలో ఆరు రోజులు తెరిచి ఉంటాయి. ఆదివారం మాత్రం క్లోజ్ చేస్తారు.


అలానే పేదలకు కూడా రుచికరమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ క్యాంటీన్ల మెనూలో చిరు ధాన్యాల టిఫిన్లను కూడా భాగం చేశారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో ఆరు రోజులు.. రోజుకో రకం టిఫిన్ అందించన్నారు. ఒక్కో టిఫిన్‌ తయారీకి దాదాపు రూ.19 వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తంలో వినియోగదారుల వద్ద నుంచి రూ.5 వసూలు చేస్తే.. మిగిలిన 14 రూపాయలను జీహెచ్ఎంసీ భరిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa