ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరేళ్ల బాలికని చిత్రహింసలకు గురిచేస్తున్న కన్నతల్లి, సవతి తండ్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:48 PM

హైదరాబాద్ ఓల్డ్ హఫీజ్‌పేట్‌లో ఆరేళ్ల చిన్నారిని కన్నతల్లి, సవతి తండ్రి దారుణంగా హింసించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు కన్నతల్లి షబానా, ఆమె రెండో భర్త జావీద్‌ను అరెస్ట్ చేశారు. స్థానికుల చొరవతో ఈ దారుణం బయటపడింది.పోలీసుల కథనం ప్రకారం రెండు రోజుల క్రితం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా, ఆమె శరీరంపై ఉన్న గాయాలను కొందరు స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి పాపను దగ్గరకు పిలిచి ఆరా తీయగా, తన తల్లి, సవతి తండ్రి తనను చిత్రహింసలు పెడుతున్నారని చెప్పడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుగా బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి, తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం, విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసి, షబానా, జావీద్‌లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.మొదటి భర్త బాబు మియాతో విడాకులు తీసుకున్న షబానా, జావీద్‌ను రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి బాలిక వీరి వద్దే ఉంటోంది. చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత, బాలికను సురక్షితంగా ఆమె కన్నతండ్రి అయిన బాబు మియాకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa