తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ గ్లోబల్ ప్రతినిధుల బృందం జరిపిన భేటీ అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. ఈ పెట్టుబడితో తెలంగాణ ఔషధ రంగంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఉంది.
రూ. 9,000 కోట్లతో కొత్త ప్లాంట్
ఎలి లిల్లీ సంస్థ తెలంగాణలో సుమారు 1 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.9,000 కోట్లు) భారీ పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా హైదరాబాద్లో ఒక అత్యాధునిక ఉత్పత్తి, నాణ్యత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కొత్త కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ఈ సమావేశంలో ఎలి లిల్లీ గ్లోబల్ అధ్యక్షుడు ప్యాట్రిన్ జాన్సన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు విన్సెలో టుకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కూడా ఈ చర్చల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ భారీ పెట్టుబడి రాష్ట్రానికి కొత్త ఉపాధి అవకాశాలను తీసుకురావడంతో పాటు.. తెలంగాణ ఔషధ రంగానికి ఎంతో మేలు చేకూర్చుతుందని సంస్థ ప్రతినిధులను అభినందించారు.
ఎలి లిల్లీ సంస్థ వెంటనే హైదరాబాద్లోని తమ కొత్త కేంద్రం కోసం నియామకాలు చేపట్టనుంది. ఇందులో ప్రధానంగా ఇంజనీర్లు, రసాయన శాస్త్రవేత్తలు (కెమిస్టులు), అనలిటికల్ సైంటిస్ట్, నాణ్యత నియంత్రణ (QC) నిపుణులు, మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల కోసం ఔషధాలను ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం ఫార్మా రంగానికి సంబంధించిన పాలసీని మరింత ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు.
దీనిలో భాగంగా.. జీనోమ్ వ్యాలీ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ స్థాపనలో ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించనుంది. పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడానికి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో స్కిల్ యూనివర్సిటీని స్థాపిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ యూనివర్సిటీ బోర్డులో ఫార్మా రంగ ప్రముఖులు ఉండటం వల్ల, నైపుణ్య విద్య , శిక్షణలో అధిక నాణ్యత పాటించబడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa