జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక వేడి రాజుకుంటున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ టికెట్ ఆశిస్తున్న కీలక నేత నవీన్ యాదవ్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద క్రిమినల్ కేసు నమోదైంది. నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, ఆయన కొత్త ఓటర్ కార్డులను పంపిణీ చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జూబ్లీహిల్స్ పరిధిలో నవీన్ యాదవ్ ఓటర్లకు కొత్తగా జారీ అయిన ఓటర్ ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ నాయకులు ఇలాంటి అధికారిక పత్రాలను పంపిణీ చేయడం ఓటర్లను ప్రలోభపెట్టడమేనని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఉల్లంఘనపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి స్వయంగా మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్ యాదవ్పై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్లు 170, 171, 174లతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ పద్ధతులకు పాల్పడటం, అధికారిక హోదాను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలతో ఈ సెక్షన్లను చేర్చారు.కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసులో నవీన్ యాదవ్ ముందువరుసలో ఉన్నారు. ఆయనతో పాటు సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లను కూడా పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి కీలక సమయంలో నవీన్ యాదవ్పై కేసు నమోదు కావడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అర్ధాంగి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోంది.ఈ ఉపఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ ఇప్పటికే హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa