ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ‘బిహార్ MY ఫార్ములా’..! బీఆర్ఎస్‌కు కష్టమేనా..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 06:35 PM

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనుండగా.. అదే సమయంలో జూబ్లీహిల్స్ బైపోల్ కూడా జరగనుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి, విజేతను నిర్ణయిస్తారు.


కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దిగడం ఖాయం కావడంతో.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉండనుంది. బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించింది. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇవ్వడంతో సానుభూతి తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. బస్తీల్లో మాగంటికి ఉన్న పట్టు తమకు కలిసొస్తుందని భావిస్తోంది.


మరోవైపు అధికార కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న నవీన్ యాదవ్‌కు ఆ పార్టీ టికెట్ దాదాపుగా ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. తాను పోటీలో లేనని బొంతు రామ్మోహన్ చెప్పడంతో.. నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు మజ్లిస్ పార్టీ సైతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేయకుండా.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి.. మజ్లిస్ మద్దతునివ్వడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది.


సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణిస్తే.. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనే సంప్రదాయం గతంలో ఉండేది. కానీ కేసీఆర్ హయాంలో పరిస్థితి మారింది. అధికార పార్టీ ఉపఎన్నికల్లో గెలవడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో జరిగిన పాలేరు ఉపఎన్నికలో గులాబీ పార్టీ గెలవగా.. ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది.


ఈ సెంటిమెంట్‌తోపాటు మరో ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. బిహార్‌లో ఆర్జేడీకి బలమైన MY ఓటు బ్యాంక్ ఉంది. లాలుప్రసాద్ యాదవ్ సొంత సామాజికవర్గమైన యాదవులతోపాటు ముస్లింలు కూడా గంపగుత్తగా ఆర్జేడీకి ఓటేస్తుంటారు. ఈ ఓటు బ్యాంకు కారణంగా చాలా కాలంపాటు లాలు ఫ్యామిలీ బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పింది. అయితే మరోవైపు ఇతర ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ కావడం, ముఖ్యంగా హిందూ ఓటు బ్యాంక్ ఎన్డీయే కూటమి వైపు మళ్లడంతో బిహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి గెలుపు కష్టంగా మారుతోంది. కానీ 30 శాతానికిపైగా బలమైన ఓటు బ్యాంకు మాత్రం ఇప్పటికీ ఆర్జేడీకి వైపు బలంగా ఉంటోంది.


నవీన్ యాదవ్‌కు టికెట్ దక్కితే.. ఇదే స్ట్రాటజీని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని చెప్పొచ్చు. నవీన్ యాదవ్ 2014లో మజ్లిస్ తరఫున పోటీ చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో 42 వేల ఓట్లు సాధించిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని మూడో స్థానానికి నెట్టారు. ముస్లింలు, యాదవుల ఓట్లు కన్సాలిడేట్ అవ్వడంతో ఆయన మాగంటికి గట్టి పోటీని ఇవ్వగలిగారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆయనకు 18 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. ఈ ప్రాంతంలో నవీన్ యాదవ్‌కు ఉన్న పట్టు ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.


తాజా ఉపఎన్నిక విషయానికి వస్తే.. అధికార పక్షం అండదండలు, ముస్లిం-యాదవ ఓటు బ్యాంక్‌ మద్దతు ఉండటం లాంటి అంశాలు నవీన్ యాదవ్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే.. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లను తమ వైపు మొగ్గుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. నవీన్ యాదవ్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు దగ్గరి బంధువు. తలసాని సోదరుడి కుమార్తెనే నవీన్ యాదవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. దీంతో తలసాని బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరిస్తారా లేదా అల్లుడి కోసం సైలెంట్‌గా ఉంటారా అనేది కూడా కీలకం కానుంది.


MY ఫ్యాక్టర్ వల్ల జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. నియోజకవర్గంలో మాగంటి కుటుంబం పట్ల సానుభూతి బలంగా ఉండటం, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంటే మాత్రం గులాబీ పార్టీ తన స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa