ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థానిక సంస్థల ఎన్నికలకి నేడు నోటిఫికేషన్ విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:10 PM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడటంతోనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల కోసం ఎస్ఈసీ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాల్సి ఉంటుంది. స్వీకరించిన నామినేషన్లను అక్టోబర్ 12న అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో, జడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చెల్లించాల్సిన డిపాజిట్ వివరాలను కూడా ఎస్ఈసీ స్పష్టం చేసింది. జడ్పీటీసీ బరిలో నిలిచే జనరల్ అభ్యర్థులు రూ.5,000, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రూ.2,500 చొప్పున డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎంపీటీసీ స్థానానికి పోటీపడే జనరల్ అభ్యర్థులు రూ.2,500, రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.1,250 డిపాజిట్‌గా చెల్లించాలని తెలిపింది.నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు పూర్తి ధృవపత్రాలు, ఫోటోలు, డిపాజిట్ రసీదును తప్పనిసరిగా జతచేయాలని ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థితో పాటు కేవలం నలుగురు మాత్రమే కార్యాలయంలోకి రావాలని, మొత్తం ఐదుగురికి మించి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa