ఉపాధి కోసం జోర్డాన్కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది తెలంగాణ వలస కార్మికుల దుస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఈ కార్మికులు తిరిగి స్వదేశానికి రాలేక, అక్కడే ఉండేందుకు డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూడడం సిగ్గుచేటని విమర్శించారు. దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న తమ పౌరులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అని హరీశ్రావు నిలదీశారు.
బీఆర్ఎస్ పాలనలో వెనక్కి తగ్గిన వలసలు, కాంగ్రెస్ పాలనలో మళ్లీ పెరిగాయని హరీశ్రావు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోవడంతోనే ప్రజలు మళ్లీ ఎడారి ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే, వలస కార్మికుల కుటుంబాలను కూడా దారుణంగా వంచించిందని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తమ 'అభయ హస్తం' మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ, ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎత్తిచూపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ పనితీరుపై హరీశ్రావు ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, గౌరవ సభ్యులు సంక్షోభంలో ఉన్న కార్మికుల కోసం ఏం చేస్తున్నారని నిలదీశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డులు, విదేశాల్లో ఉన్న వలస కార్మికుల కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటుకు అతీగతీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వలస కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని ఇది నిరూపిస్తుందని తెలిపారు.
జోర్డాన్లో చిక్కుకుపోయిన తెలంగాణ కార్మికులను తక్షణమే స్వదేశానికి రప్పించాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. మానవతా దృక్పథంతో కార్మికులను వారి కుటుంబాల చెంతకు చేర్చడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వలస కార్మికుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa