ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణను వణికిస్తున్న చికున్ గున్యా.. 60 రెట్లు పెరిగిన కేసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 02:26 PM

తెలంగాణను చికున్ గున్యా వణికిస్తోంది. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ఎక్కువగానే చికున్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. 2020, 2024 మధ్య తెలంగాణలో (సస్పెక్టెడ్) చికున్‌ గున్యా కేసులు 60 రెట్లు పెరిగాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలలో.. తెలంగాణ టాప్‌లో ఉండటం గమనార్హం. 2025లో కూడా వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో కేసులు పెరిగాయి.


  2021లో కేవలం 220 (సస్పెక్టెడ్) కేసులు మాత్రమే నమోదవగా.. 2024లో ఆ సంఖ్య 13,592కు చేరింది. అంటే 60 రెట్లు కేసుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ.. చికున్ గున్యా కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 2021లో 753 కేసులు నమోదవగా.. 2024లో దాదాపు ఆరు రెట్లు పెరిగి.. 4,213కి చేరుకుంది. ఆ తర్వాత స్థానాల్లో.. హర్యానా (765 నుంచి 2,766), మధ్యప్రదేశ్ (3,822 నుంచి 13,677), పంజాబ్ (644 నుంచి 2,258), కర్ణాటక (40,134 నుంచి 78,217) ఉన్నాయి. 2025లో ఆగస్టు వరకు తెలంగాణలో కేసుల పెరుగుదల కొనసాగిందని NCVBDC నివేదిక పేర్కొంది. 7,176 (సస్పెక్టెడ్) కేసులు నమోదైనట్లు తెలిపింది.


కేసుల పెరుగుదలకు కారణాలివే..


పాత పైపులైన్లు మూసుకుపోవడం, దెబ్బతినడం, మ్యాన్‌హోల్స్ నుంచి వ్యర్థాలను సరిగ్గా తొలగించకపోవడం వల్ల మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. ఇది ప్రధాన సమస్యగా పేర్కొంటున్నారు వైద్యులు. దీనికి తోడు నీటి కాలుష్యం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. అందుకే ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది హైదరాబాద్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో వరదలు, ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచిపోయిందని తెలిపారు. దీంతో దోమలకు అనువైన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు.


కేసులు తగ్గాలంటే ఏం చేయాలి?


లార్వాను నిరోధించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం ముందు.. ముగిసిన తర్వాత లార్వా నిరోధించడం, పాగింగ్, వ్యర్థాలు, డ్రైనేజీలను శుభ్రం చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది ఈ చర్యలను నిరంతరం నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా వర్షాకాలంలో.. డ్రంబుల్లో, కూలర్లలో నీటిని నిల్వ చేయొద్దని చెప్పారు. చికున్ గున్యాను వ్యాప్తి చేసే లార్వా.. ఇలాంటి చోట్లలో తయారవుతుందని చెప్పారు. DMHO బృందాలు ఫ్రై డే డ్రై డే అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నాయని తెలిపారు.


చికున్ గున్యా లక్షణాలు ..


ఏడిస్ దోమల ద్వారా వైరల్ వ్యాధి అయిన చికున్‌ గున్యా వ్యాపిస్తుంది. చికున్ గున్యా వస్తే జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు వస్తాయి. తరచుగా తలనొప్పి, కండరాల నొప్పి, చర్మపు దద్దుర్లు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చికున్ గున్యా రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. దొమల నుంచి రక్షించుకోవడానికి సూచనలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa