సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఇంటర్ఛేంజ్ వరకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఎట్టకేలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 29న నోటిఫికేషన్ను జారీ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సన్నద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకిగా ఉన్న కీలకమైన రక్షణ శాఖ భూముల అప్పగింత ప్రక్రియ ఒక కొలిక్కి రావడంతో టెండర్ల అనంతరం నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
ప్యారడైజ్ నుంచి రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే డైయిరీఫాం కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు శామీర్పేట కారిడార్కు టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తర తెలంగాణ వైపు ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభిస్తుంది. ముఖ్యంగా, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల వైపు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుండి శామీర్పేట వరకు సిగ్నల్-రహిత ప్రయాణం సాధ్యమవుతుంది, తద్వారా సమయం గణనీయంగా ఆదా అవుతుంది.
ఈ శామీర్పేట ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ ఇంటర్ఛేంజ్ వరకు 18.10 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సుమారు 197 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇందులో 113.48 ఎకరాల భూమి రక్షణ శాఖకు సంబంధించినది. భూ పరిహారం వ్యయంతో సహా ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 3,619 కోట్లుగా నిర్ణయించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కారిడార్ నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఉత్తర ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa