హైదరాబాద్లోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి, నియోజకవర్గ సమస్యలపై గట్టిగా గళమెత్తిన లంకల దీపక్ రెడ్డినే మరోసారి బరిలోకి దింపాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం నుండి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి అని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి.
దీపక్ రెడ్డి పేరును ఖరారు చేయడంలో పార్టీ వ్యూహాత్మక ఆలోచనలు ఉన్నట్లు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య, అలాగే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్లో పార్టీ ప్రదర్శించిన మెరుగైన ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన అనుభవం, నియోజకవర్గంలో ఆయనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో ఉన్న అనుబంధం.. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, దీపక్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగిన నేపథ్యంలో, దీపక్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైతే, తక్షణమే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని కమలదళం యోచిస్తోంది. ముఖ్యంగా, స్థానిక సమస్యలపై ఆయన గతంలో చేసిన పోరాటం, ముఖ్యంగా మౌలిక సదుపాయాల లోపాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది.
దీపక్ రెడ్డి పేరు అధికారికంగా ప్రకటించిన వెంటనే, కేంద్ర నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఉపఎన్నిక ఫలితం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, దీపక్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులు సైతం రంగంలోకి దిగనున్నారు. బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా ఈ కీలక పోరులో విజయం సాధించి, ప్రధాన ప్రత్యర్థులకు గట్టి సందేశం ఇవ్వాలని బీజేపీ సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa