జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి చిహ్నమైన 'కారు' గుర్తుకు ఓటేస్తారో, లేక విధ్వంసానికి ప్రతీకగా మారిన 'బుల్డోజర్'ను ఎంచుకుంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్క మహేశ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్లోని పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు, చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా గరీబుల నివాసాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. "కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి జరగదు, బుల్డోజర్లు మాత్రమే వస్తాయి. ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి" అని ఆయన హెచ్చరించారు. రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని రూ. 2.80 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. నెలకు రూ. 4 వేల పెన్షన్ వంటి హామీలు అమలు కావాలంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించడమే మార్గమని అన్నారు. "ఈ ఎన్నికలో అధికార పార్టీ ఓడిపోతేనే వారికి భయం పుట్టి హామీలను అమలు చేస్తారు. ఒకవేళ పొరపాటున గెలిపిస్తే, మనం ఎన్ని మోసాలు చేసినా ప్రజలు ఏమీ చేయలేరనే ధీమాతో ఉంటారు" అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లు, అజారుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి, ముస్లింలకు ఖబరస్థాన్ స్థలం వంటి విషయాల్లోనూ కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. "ప్రజలను తెలిసి తెలిసి మోసం చేయడమే రేవంత్ రెడ్డి నైజం. గతంలో 'మోసం చేసే వాళ్లనే ప్రజలు నమ్ముతారు' అని ఆయనే స్వయంగా చెప్పారు" అని కేటీఆర్ గుర్తుచేశారు.ఈ సందర్భంగా బీజేపీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాని పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయడం అంటే ఆ ఓటును మోరీలో వేసినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10,000 పంచి గెలవాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పథంలో పయనించాలంటే కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని, అందుకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేళ్లుగా కేసీఆర్ను తిట్టడం మినహా రేవంత్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa