తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జరిగిన అతిపెద్ద కుంభకోణం తాజాగా వెలుగు చూసింది. మిల్లర్లు , కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏకమై.. వడ్లు కొనకుండానే కొన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి వేల కోట్ల రూపాయలను స్వాహా చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ అక్రమాల మొత్తం రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక విచారణ అంచనా వేసింది.
ఫేక్ ట్రక్ షీట్ల దందా ..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ దందా రాష్ట్రంలోని పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను స్పష్టం చేస్తోంది. మిల్లర్లకు సహకరించిన వారిలో వ్యవసాయ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సివిల్ సప్లయ్స్ ఆఫీసర్లు కూడా ఉన్నట్లు నిర్ధారణైంది. ధాన్యం కేటాయించినట్లు రికార్డుల్లో చూపించినా.. ఆ మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) తిరిగి ప్రభుత్వానికి రాకపోవడంతో.. కొత్త సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు మొదలవగానే ఈ ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం బయటపడింది.
గత పదేళ్లలో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకపోవడం వెనుక నిజమైన కారణం ఇదేనని.. తనిఖీ అధికారులు తీగ లాగగా డొంక కదిలినట్లు ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తరించి ఉంది. హనుమకొండ జిల్లాలో శాయంపేట మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి కమలాపూర్ మండలంలోని సాంబశివ రైస్ మిల్లుకు రూ. 1.70 కోట్ల విలువైన వడ్లు పంపినట్లు రికార్డులు చూపించారు. కానీ రైస్ మిల్లును తనిఖీ చేయగా అక్కడ వడ్లుగానీ, బియ్యంగానీ లేవు. ఫేక్ ట్రక్ షీట్లలో రైతుల పేర్లకు బదులు రైస్ మిల్లు యజమాని కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు ఉండటం ఈ మోసానికి స్పష్టమైన ఆధారం.
ఈ వ్యవహారంలో భాగస్వాములు అయిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. నిధుల రికవరీకి నివేదిక సమర్పించారు.
మహబూబాబాద్ జిల్లాలో మూడు రైస్ మిల్లులపై దాడులు చేయగా.. రూ. 24 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు తేలింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన కొందరు బడా వ్యాపారులు ఈ తరహా దందా కోసమే రైస్ మిల్లులను ఏర్పాటు చేసి.. రూ. 20 కోట్లకు పైగా కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో 51 మంది మిల్లర్లు రూ. 270 కోట్ల విలువైన ధాన్యం కేటాయించుకొని సీఎంఆర్ ఇవ్వలేదు. దీనిపై వడ్డీ, పెనాల్టీలు కలిపి మొత్తం రూ. 372 కోట్లుగా నమోదైంది.
మెదక్ జిల్లాలో బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి రూ. 13.13 కోట్లు, రా రైస్ మిల్లుల నుంచి రూ. 26.56 కోట్ల విలువైన ధాన్యం రికార్డుల్లో ఉండి.. వాస్తవంగా ఎక్కడా నిల్వ లేకపోవడంపై 24 మిల్లులపై లోతుగా విచారణ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు గుర్తించారు. బోధన్కు చెందిన ఒక మాజీ నాయకుడు రూ. 160 కోట్లు కాజేసినట్లు అధికారులు తేల్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa