ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల సమస్యలకు చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 08:03 PM

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, విద్యార్థుల సంక్షేమం, వసతుల మెరుగుదల, నిధుల సక్రమ వినియోగంపై ఆయన ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న అత్యవసర పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 60 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను హాస్టళ్లలో డైట్ ఛార్జీలుచెల్లించడం, తాత్కాలిక సిబ్బంది జీతాలు, మోటార్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు వినియోగించేందుకు వెసులుబాటు కల్పించారు.


ముఖ్యమంత్రి ఐసీసీసీ వేదికగా సంక్షేమ గృహాలు, విద్యా సంస్థలపై ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సబ్యసాచి ఘోష్ హాస్టళ్ల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి నిధుల చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందించారు. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేయాలని నిర్దేశించారు. దీని ద్వారా పూర్తి స్థాయి సమాచారం, జవాబుదారీతనం ఉండేలా చూసుకోవాలన్నారు.


హాస్టల్ విద్యార్థుల నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు అందజేసే ఆహారం నాణ్యతను తెలుసుకోవడానికి ఒక యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. సరైన పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని.. కాల్షియం, విటమిన్స్ వంటి పోషక విలువలు గురించి డేటా ఉండాలని చెప్పారు. అలాగే.. యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో అందేలా సీనియర్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, ఏరియా ఆసుపత్రులను హాస్టళ్లతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాలు తరచుగా నిర్వహించాలని, అత్యవసర సమయాల్లో 24 గంటలు ఆన్‌లైన్‌లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు.


జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచుగా హాస్టళ్లను తనిఖీ చేసి, మెరుగైన సేవలు అందేలా పర్యవేక్షించాలన్నారు. హాస్టళ్లలోని వసతులు, నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డాష్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణ, బకాయిల చెల్లింపు కోసం ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు , సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సబ్యసాచి ఘోష్ ని ఉద్దేశించి.. స్కాలర్‌షిప్‌లు, జీతాలు, నిర్మాణ ఖర్చులతో పాటు నెలవారీ నిర్వహణ, బకాయిల చెల్లింపు కోసం అవసరమైన మొత్తానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని కోరారు. అలాగే.. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.


పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఎడ్ టెక్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్ సేవలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడానికి యాప్‌లు రూపొందించాలని కూడా సీఎం అధికారులను పురమాయించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ (బీసీ సంక్షేమం), శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం)తో పాటు ముఖ్యమంత్రి సలహాదారులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa