ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత – దామోదర్ రాజనర్సింహ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 10:58 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల కేసులు గణనీయంగా తగ్గాయని వారు మంత్రికి వివరించారు.గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చికున్‌గున్యా 361 కేసులు నమోదవగా, ఈ ఏడాది అదే కాలంలో 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. అలాగే, మలేరియా కేసులు గతేడాది 226 ఉండగా, ఈ ఏడాది 209కి తగ్గాయని వెల్లడించారు. టైఫాయిడ్ కేసులు కూడా గణనీయంగా తగ్గి, గతేడాది 10,149 నుంచి ఈ ఏడాది 4,600 కేసులకు తగ్గాయని పేర్కొన్నారు. అలాగే డెంగీ కేసులు గతేడాదితో పోలిస్తే దాదాపు 2,900 తక్కువగా ఉన్నాయని అధికారులు నివేదికలో వివరించారు.ఈ వివరాలను పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గడం సంతోషకరమని పేర్కొన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మరో నాలుగైదు జిల్లాల్లో కొద్దిగా కేసులు పెరిగినట్లు గుర్తించి, ఆ జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్లను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు.కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో, స్థానిక వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వర్షాల అనంతరం వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉండేందున, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.వాతావరణ మార్పులతో కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య విభాగం తరచుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజల్లో అవగాహన పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.వర్షాలు పడుతున్న జిల్లాల్లో ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని కూడా మంత్రి సూచించారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సీజనల్ వ్యాధులు సోకిన సందర్భంలో ప్రభుత్వ దవాఖానల వైద్య సేవలను వినియోగించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa