ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యూనెట్ వంటి గొలుసుకట్టు సంస్థలు సమాజంపై తీవ్ర ప్రభావం : సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 06:33 AM

మోసపూరిత మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్ మరో యువకుడి ప్రాణాన్ని బలిగొంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే యువకుడు క్యూనెట్ వలలో చిక్కుకుని బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ, "క్యూనెట్ వంటి గొలుసుకట్టు సంస్థలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక లాభాల ఆశ చూపి యువతను ఆర్థికంగా నాశనం చేసి, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇది సమాజానికి పెను ముప్పు" అని హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత సంస్థల బారిన పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.హరికృష్ణ ఆత్మహత్య కేసులో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు చేపట్టిన దర్యాప్తును సజ్జనార్ ప్రశంసించారు. ఈ కేసులో వేగంగా స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంపై పోలీసులకు అభినందనలు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే దిశగా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.గతంలో వీసీ సజ్జనార్ ఇలాంటి అనేక మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. యువత, నిరుద్యోగులు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలను నమ్మి ఇలాంటి స్కీముల్లో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa