ఆధార్ కార్డు వినియోగదారులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఆధార్ కార్డు వివరాలలో మార్పులు చేసుకోవడానికి చెల్లించాల్సిన రుసుములను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పెంచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఛార్జీలను సవరించడం గమనార్హం. ఈ కొత్త రుసుముల విధానం 2028, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత వీటిపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.తాజా పెంపు ప్రకారం పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి డెమోగ్రాఫిక్ వివరాల మార్పు కోసం ఇకపై రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ చార్జీ రూ. 50గా ఉండేది. అదేవిధంగా, వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాల అప్డేట్ కోసం రుసుమును రూ. 100 నుంచి రూ. 125కి పెంచారు. ఆధార్ కార్డు జారీ అయిన తర్వాత చేసే మార్పులకు మాత్రమే ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.అయితే, కొన్ని కీలక సేవలకు ఈ పెంపు నుంచి మినహాయింపు ఇచ్చారు. కొత్తగా పుట్టిన శిశువులకు ఆధార్ నమోదు ప్రక్రియను యథావిధిగా ఉచితంగానే అందిస్తారు. అలాగే, పిల్లలకు ఐదేళ్ల వయసులోనూ, ఆ తర్వాత 5 నుంచి 7 ఏళ్ల మధ్య, తిరిగి 15 నుంచి 17 ఏళ్ల మధ్య తప్పనిసరిగా చేయించాల్సిన బయోమెట్రిక్ అప్డేట్లకు కూడా ఎలాంటి రుసుము వసూలు చేయరని యూఐడీఏఐ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa