ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానాశ్రయం కోసం,,, రూ.90 కోట్ల నిధులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 08:53 PM

తెలంగాణలో విమానయానరంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌లో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయి. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మిగతా జిల్లాల్లో కూడా ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఉన్న మామునూరు విమానాశ్రయం పున:ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కూడా ఈ విమానాశ్రయం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈక్రమంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఇప్పటికే ఉన్న 696 ఎకరాలతో పాటుగా ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి మరో 280.3 ఎకరాల భూమి అవసరమని ఏఏఐ గుర్తించింది. ఏఏఐ ఈ భూమిని.. రన్‌వే విస్తరణ, ఏటీసీ భవనం, టెర్మినల్ నిర్మాణానికి ఉపయోగించనుంది. ఈ భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో రూ.205 కోట్లు విడుదల చేసింది. ఇక తాజాగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు మరో రూ.90 కోట్లు మంజూరు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియ వేగవంతం కానుంది.


ఇప్పటికే మామునూరు విమానాశ్రయం పరిధిలో 696 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. దీనిలో విమానాశ్రయం అభివృద్ధికి.. మరీ ముఖ్యంగా ఏ-320 రకం విమానాలు.. సురక్షితంగా ల్యాండ్ కావడం, టేకాఫ్ అవ్వడానికి అవసరమైన కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. దీంతో పాటుగా మరో 280.3 ఎకరాల భూమి కూడా అవసరమని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గుర్తించింది. ఈభూమి సేకరణ కోసం ఏఏఐ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.


భూసేకరణ అంశంతో పాటుగా.. ఏఏఐ మరికొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిలో భాగంగా వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ని అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. విమానాశ్రయం అభివృద్ధితో పాటుగా ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన ఖర్చులను తామే భరిస్తామని ఏఏఐ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించే భూమిలో చేపట్టబోయే పనుల గురించి కూడా సమగ్ర నివేదిక అందజేసింది. ఏటీసీ అంటే విమానాల రాకపోకలను నియంత్రించే కేంద్రం.


ఈ అభివృద్ధి పనులన్నీ పూర్తయితే, వరంగల్ ప్రాంతానికి మెరుగైన విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయి అంటున్నారు. ఇక విమానాశ్రయ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈభూసేకరణ కోసమే ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం వినియోగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa