హైదరాబాద్లోని మూసాపేట మెట్రో స్టేషన్లో శనివారం రాత్రి అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి బ్యాగులో 9 ఎంఎం బుల్లెట్ లభించడంతో స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మెట్రో భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బుల్లెట్తో దొరికిన యువకుడిని అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
బీహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి ఇతను ఒక బ్యాగ్తో మూసాపేట మెట్రో స్టేషన్కు చేరుకున్నాడు. మెట్రో స్టేషన్లలో సాధారణంగా నిర్వహించే స్కానింగ్ ప్రక్రియలో భాగంగా, ఇతని బ్యాగు స్కానర్ ద్వారా వెళ్తుండగా అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ శబ్దం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బ్యాగును తనిఖీ చేయగా అందులో 9 ఎంఎం బుల్లెట్ బయటపడింది.
వెంటనే భద్రతా సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహమ్మద్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ బుల్లెట్ అతనికి ఎలా లభించింది? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? దీని వెనుక ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనతో మెట్రో స్టేషన్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడి కాల్ డేటా, పూర్వ చరిత్రను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్ల వద్ద భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఒక బుల్లెట్ను గుర్తించి, ప్రయాణికుడిని అదుపులోకి తీసుకోవడం ద్వారా పెను ప్రమాదాన్ని నివారించినట్లయింది. ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa