నల్లగొండ జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్ని మరిచి ఓ తల్లి తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన కొండమల్లేపల్లిలో వెలుగుచూసింది. ఈ సంఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.పోలీసులు అందించిన వివరాల ప్రకారం, మృతులను కుంచాల నాగలక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భువన్ సాయి (7)గా గుర్తించారు. వీరు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా, జనకారం గ్రామానికి చెందిన వారని తెలిసింది. నాగలక్ష్మి మొదట తన ఇద్దరు పిల్లలను చంపి, అనంతరం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది.ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగానే నాగలక్ష్మి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa