కామారెడ్డి జిల్లాలోని నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం నుంచి బీబీపేట మండలం ఇస్సానగర్ గ్రామానికి కలుపుతూ ఉన్న సరిహద్దు వంతెన ఇప్పుడు ప్రజలకు భయానక పీడకలగా మారింది. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలతో వంతెన మధ్యభాగంలో భారీ రంధ్రం ఏర్పడటమే కాకుండా, దాని అడుగు భాగం కూడా పూర్తిగా కూలిపోయింది. ఈ వంతెన రెండు మండలాల ప్రజలకు ఏకైక రవాణా మార్గంగా ఉండటంతో ఇప్పుడు వారి జీవితాలు తీవ్ర సంకష్టంలో పడ్డాయి.
ప్రతిరోజూ వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, రెండు చక్రాల నుంచి నాలుగు చక్రాల వాహనాల వరకు ఈ వంతెనపైనే ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు వంతెన మధ్యలో ఏర్పడిన భారీ గుంత వల్ల ఎవరైనా కాలు జారి పడితే నేరుగా కింది నీటి ప్రవాహంలో పడే ప్రమాదం ఉంది. రాత్రిపూట అయితే ఈ రంధ్రం కనిపించకపోవడంతో మరింత ఘోర ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన అధికారులు తాత్కాలిక చర్యగా వంతెన రెండు వైపులా చెట్ల కొమ్మలు, మండలు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ అడ్డంకులు రాత్రిళ్లు స్పష్టంగా కనిపించకపోవడం, గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో ప్రజలు ఇంకా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైనా ఆ కొమ్మలను దాటి వెళ్తే పెను ప్రమాదం తప్పదని వారు చెబుతున్నారు.
రెండు మండలాలను అనుసంధానం చేసే ఈ జీవనాడి వంతెనను వెంటనే కొత్తగా నిర్మించాలని లేదా బలోపేతం చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ఈ ప్రమాదకర వంతెన వల్ల ఒక్కో జీవితం కోల్పోయే పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa