దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను (SIR) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. "పొరుగు దేశం నుంచి వచ్చిన ఓ కూలీకి రేషన్ కోసం ఆధార్ కార్డు ఇస్తే, అతడిని ఓటరుగా కూడా చేయాలా?" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీసు కాదని, ఓటరు దరఖాస్తుతో పాటు సమర్పించిన పత్రాల వాస్తవికతను పరిశీలించే అధికారం దానికి ఉందని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa