తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై విధించే జరిమానాలకు ప్రతి ఏటా ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. ఈ సడలింపు వల్ల పాత పెండింగ్ చలాన్లు కూడా ఒకేసారి క్లియర్ చేసుకునే అవకాశం వాహనదారులకు లభిస్తోంది. ఫలితంగా చలాన్ల చెల్లింపు రేటు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఈ “రాయితీ ఉత్సవం” నిజంగా రోడ్డు భద్రతకు మేలు చేస్తోందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
హైకోర్టు ఇటీవల ఒక కేసు విచారణలో ఈ డిస్కౌంట్ విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించినా కొంతకాలం తర్వాత రాయితీ వచ్చి చవకగా తప్పించుకోవచ్చనే మనస్తత్వం వాహనదారుల్లో పెరుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. చట్ట భయం తగ్గిపోతే క్రమశిక్షణ ఎలా వస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రవాణా శాఖపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి.
నిజానికి రాయితీలు ప్రకటించిన ప్రతిసారీ చలాన్ల క్లియరెన్స్ రేటు ఆకస్మికంగా పెరుగుతుంది. కానీ మిగతా రోజుల్లో నిబంధనల ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదన్నది గస్తీ అధికారుల అనుభవం. అంటే రాయితీ కాలం కోసం ఉల్లంఘనలు చేసి వేచి ఉండే పరిస్థితి ఏర్పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది రోడ్డు భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఈ డిస్కౌంట్ పథకం ఉపయోగపడుతుంది కానీ, చట్ట భయం, క్రమశిక్షణ పెంపొందించడంలో మాత్రం విఫలమవుతుందని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఇకనైనా రాయితీల బదులు కఠిన అమలుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ కోర్టు పరోక్షంగా రవాణా శాఖకు దిశానిర్దేశం చేసినట్టుగా కనిపిస్తోంది. లేదంటే “చలాన్ కట్టడం డిస్కౌంట్ సేల్లా” మారిపోతుందనే ఆందోళన నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa