హైదరాబాద్ పోలీసు శాఖ దర్యాప్తు ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకోనుంది. నగరంలో సంచలనం సృష్టించే, కీలకమైన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసేందుకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త బృందం ఏర్పాటుతో ముఖ్యమైన కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం అన్ని రకాల కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే, సీఐటీ ఏర్పాటు ద్వారా సాధారణ కేసులతో సంబంధం లేకుండా కేవలం సంచలనాత్మక కేసులపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఇది దర్యాప్తులో జాప్యాన్ని నివారించి, నాణ్యతను పెంచుతుందని పోలీసు శాఖ అంచనా వేస్తోంది.ఈ సీఐటీ బృందం బాధ్యతలు కేవలం దర్యాప్తుకే పరిమితం కావు. కేసు నమోదు దగ్గర నుంచి ఆధారాల సేకరణ, కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఆ తర్వాత కేసు విచారణ ప్రక్రియను కూడా ఈ టీమ్ నిశితంగా పర్యవేక్షిస్తుంది. కేసు మొదటి దశ నుంచి తుది తీర్పు వెలువడే వరకు పూర్తి బాధ్యత వహించేలా సీఐటీ విధివిధానాలను రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయంతో కీలక కేసుల్లో దోషులకు త్వరగా శిక్ష పడేలా చేయవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa