తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఈ చీరల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు పండుగలు, ఇతర సందర్భాలను పురస్కరించుకొని ఉచితంగా చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ ఇందిరమ్మ చీరల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వస్త్ర పరిశ్రమకు, ముఖ్యంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరలను మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం దాదాపు 44 లక్షల చీరలను లబ్ధిదారులకు విజయవంతంగా పంపిణీ చేసింది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. అధికారులు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ చీరలను అందించేందుకు కొత్త కార్యాచరణను ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళా లబ్ధిదారులకు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చీరలను పంపిణీ చేయడం ద్వారా ఈ పథకానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల స్వీకరణతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఉత్సాహంతో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తమ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తోంది.
పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత డిసెంబర్ 11న, రెండో విడత డిసెంబర్ 14న, మూడో విడత డిసెంబర్ 17న నిర్వహించనున్నారు. ఎన్నికలు ముగిసిన.. కోడ్ ఎత్తివేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన చీరల పంపిణీని వెంటనే పునఃప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa