తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి మధ్య సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామీణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం స్పష్టమైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం చేయడమా? ఇది ముమ్మాటికీ ఎన్నికల నియమావళిని తుంగలు తొక్కడమే” అని కవిత ధ్వజమెత్తారు. ఈ పర్యటనలు కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకేనని, గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆమె ఆరోపించారు.
ఈ విషయంపై ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం పర్యటనలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అన్యాయమైన అడ్వాంటేజ్ లభిస్తుందని హెచ్చరించారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.
కాసేపట్లోనే ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు అధికారిక ఫిర్యాదు సమర్పించనున్నట్లు కవిత ప్రకటించారు. ఈ ఘటనతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa