వరంగల్ ప్రజల దశాబ్దాల నాటి కల అయిన మామూనూరు విమానాశ్రయం పునరుద్ధరణకు కేంద్రం నుంచి భారీ ఊరట లభించింది. నిన్న వరంగల్ పర్యటనలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు – “మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉంది. అన్ని క్లియరెన్స్లు వచ్చేశాయి, ఇక త్వరలోనే పనులు ప్రారంభిస్తాం, త్వరితగతిన పూర్తి చేస్తాం.” ఇప్పటికే 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఉందని, మిగిలిన 280 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా అందజేస్తే వేగం మరింత పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిందని కిషన్ రెడ్డి గట్టిగా విమర్శించారు. 2021లో జ్యోతిరాదిత్య సింధియా, తర్వాత తాను 2022 జులై, 2023 ఫిబ్రవరిలో కేసీఆర్కు లేఖలు రాసినా స్పందన రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూసేకరణలో సూపర్ స్పీడ్ చూపిస్తోందని, భూమి అందగానే కేంద్రం కూడా రోజురాత్రులు తేడా లేకుండా పనులు చేపడుతుందని హామీ ఇచ్చారు.
ప్రారంభంలో చిన్న విమానాలతో సర్వీసులు మొదలుపెట్టి, ప్రజల స్పందన బాగుంటే దూరప్రాంతాలకూ విమాన సర్వీసులు విస్తరిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తింపు పొందిన మామూనూరును నిజాం 1930లో నిర్మించగా, 1981 తర్వాత మూతపడింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ రెక్కలు తెరుచుకునే దిశగా దూసుకెళ్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును అయోధ్య ఎయిర్పోర్ట్ లాగా కేవలం 20 నెలల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ తరహాలో అందర్నీ ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. కేంద్రం-రాష్ట్రం కలిసి వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో త్వరలోనే వరంగల్ నుంచి ఆకాశమార్గంలో ప్రయాణం సాకారం కానుంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa