తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అణుశక్తి ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటు దిశగా కీలక అడుగులు వేస్తోంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)తో ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను పూర్తిగా భరించేందుకు తెలంగాణ జెన్కో (TGGENCO) సిద్ధంగా ఉందని NPCILకి అధికారికంగా తెలియజేసింది. దీనితో రాష్ట్రంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఆశలు మరింత ఆకాశం అంటాయి.
గతంలో నల్గొండ జిల్లాలోని దామరచర్ల ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన ఉన్నప్పటికీ, ప్రాంతీయ రాజకీయ పార్టీల తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ ప్రణాళికను ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజల్లో ఉన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రాంతాన్ని ఎంచుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అనుకూలమైన, సాంకేతికంగా సురక్షితమైన స్థలాన్ని గుర్తించే పని వేగంగా జరుగుతోంది.
అణు విద్యుత్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి స్థిరమైన, కాలుష్యరహిత విద్యుత్తు లభించడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే అవకాశం ఉంది. దేశంలో అణు ఇంధన రంగంలో తెలంగాణ కీలక భాగస్వామిగా ఎదగనుంది. ప్రస్తుతం దేశంలో 23 అణు రియాక్టర్లు పనిచేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కొత్త ప్లాంట్ జాతీయ గ్రిడ్కి మరింత బలం చేకూరుస్తుందని నిపుణుల అభిప్రాయం.
ఇప్పటికే NPCILతో సాంకేతిక, ఆర్థిక అంశాలపై సానుకూల చర్చలు జరుగుతున్నాయి. కొత్త స్థలం ఖరారు కాగానే ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ను “భవిష్యత్ శక్తి కేంద్రం”గా చూస్తూ, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణలో అణు విద్యుత్ యుగం.. ఇక కొన్ని నెలల్లోనే ప్రారంభమవుతుందన్న ఆశలు బలపడుతున్నాయి!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa