భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వల్లాల మంగమ్మ అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆమె ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందా అనే విషయంపై ఇల్లందు మండలంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ఎన్నికల ముందు అదృశ్యం..? ఏం జరిగింది?
వల్లాల మంగమ్మ భర్త, వల్లాల నరసయ్య ఇల్లందు పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి మంగమ్మ కనిపించడం లేదని.. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. బంధువుల ఇళ్లలో.. తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆమె ఆచూకీ లభించలేదని వివరించారు తమకు ఇంట్లో ఎలాంటి కలహాలు లేవని.. అంతా సవ్యంగానే ఉన్నామని.. ఎవరితోనూ శత్రుత్వం లేదని నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు ఇల్లందు సీఐ తాటిపాముల సురేశ్ మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వల్లాల మంగమ్మ తిరిగి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ వేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆమె అనుమానాస్పదంగా అదృశ్యం కావడం ఈ కేసులో రాజకీయ కోణంపై అనుమానాలను పెంచుతోంది.
వల్లాల మంగమ్మ అదృశ్యమైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, మండలాధ్యక్షుడు శీలం రమేశ్తో పాటు పలువురు నాయకులు సుభాష్ నగర్లోని మంగమ్మ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వల్లాల మంగమ్మను బెదిరింపులకు గురిచేసినా లేదా అపహరించినా ఉపేక్షించేది లేదని.. ఎంతటి వారినైనా ఎదుర్కొని పోరాటం చేస్తామని హెచ్చరించారు.
భర్త నరసయ్య సైతం తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా.. ఎన్నికల ముందు ఒక ప్రధాన అభ్యర్థి అదృశ్యం కావడం ఆ ప్రాంతంలో భయాన్ని.. ఆందోళనను పెంచుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa