ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాసవి అర్బన్ అపార్ట్‌మెంట్ ముందు,,,, ఫ్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల ధర్నా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 07:17 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలకు తాజా నిదర్శనంగా.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి అర్బన్ అపార్ట్‌మెంట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. గడువు పూర్తయినా అపార్ట్‌మెంట్‌ను తమకు హ్యాండోవర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. బాధితులు వెంటనే అపార్ట్‌మెంట్‌ను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రియల్టర్ల మోసాలు, కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరకపోవడం వెనుక ఉన్న తీవ్ర సమస్యలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ చుట్టూ కొందరు రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు అవలంబిస్తున్న మోసపూరిత విధానాలు కొనుగోలుదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.


ముఖ్యంగా ప్రీ-లాంచ్‌ల పేరుతో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి.. కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడం లేదు. గడువులోగా ఫ్లాట్లను, ప్లాట్లను అప్పగించడం లేదు. ప్రారంభంలో చెప్పిన సౌలతులు, మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం లేదు. ఒక ప్రాజెక్టును చూపి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని.. ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయకుండానే ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. దీనివల్ల మొదటి ప్రాజెక్ట్ నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం జరుగుతోంది. రియల్టర్ల మోసాల వల్ల కొనుగోలుదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ప్రజలు బ్యాంక్‌లలో లోన్లు తీసుకొని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తారు.


కానీ.. అపార్ట్‌మెంట్లు తమ చేతికి అందకపోయినా, ఈఎంఐల భారాన్ని మాత్రం తప్పక మోయాల్సి వస్తోంది. తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లు, విల్లాలు తమ చేతికి అందక, సొంతింటి కల నెరవేరక తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని.. హ్యాండోవర్ చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని బాచుపల్లి బాధితులు విజ్ఞప్తి చేశారు.


రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వంటి సంస్థలు ఈ మోసపూరిత కార్యకలాపాలపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. నగరంలో ఇటువంటి ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రీ లాంచింగ్, అడ్వాన్స్‌డ్ బుకింగ్ పేరుతో ఎన్నో మోసాలు జరిగాయి.. వీటితో జాగ్రత్తగా ఉండాలని మొదటి నుంచి కూడా అధికారులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది వీటిని పట్టిచ్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఇకనైనా వీటిపై జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa