గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించి శివారు 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడం ద్వారా బృహత్ హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విలీన ప్రక్రియ పూర్తయితే.. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు సుమారు 300 డివిజన్లకు పెరిగే అవకాశం ఉంది. శివారు ప్రాంతాల నుంచి విలీనం కానున్న పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మరో సుమారు వంద డివిజన్లు ఉన్నాయి. ఈ భారీ మార్పుకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు.
విలీన ప్రక్రియ పూర్తయ్యాక.. ప్రస్తుతం ఉన్న డివిజన్లన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు శనివారం ప్రభుత్వానికి తమ అభిప్రాయాలను సమర్పించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉన్నాయి. వీటిలో కొన్ని డివిజన్లు రెండు లేదా మూడు అసెంబ్లీ స్థానాల్లో విస్తరించి ఉండటం వలన పరిపాలన సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, డివిజన్ల హద్దులు తప్పనిసరిగా ఒకే అసెంబ్లీ స్థానం పరిధిలో ఉండేట్టుగా పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ డివిజన్ల పునర్విభజన అనంతరం, పరిపాలనా సౌలభ్యం కోసం సర్కిళ్లు, జోన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బృహత్ నగర ముఖచిత్రాన్ని రూపొందించే పనిలో జీహెచ్ఎంసీ యంత్రాంగం నిమగ్నమైంది. జూబ్లీహిల్స్లోని సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)లో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నివేదికలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా శనివారం రెండు సార్లు సీజీజీని సందర్శించి, అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు, ఇతర పత్రాలను పరిశీలించారు. శివారు పురపాలికలు, నగరపాలిక కమిషనర్లు కూడా తమ స్థానిక సంస్థల పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. విలీన ప్రక్రియకు సంబంధించిన ఆర్డినెన్స్ పత్రాలు ఇప్పటికే రాజ్భవన్కు చేరినట్లు సమాచారం, గవర్నర్ సంతకం చేయడమే తరువాయిగా ఉంది.
విలీన ప్రాంతాలతో సంబంధం లేకుండానే.. జీహెచ్ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఈ బడ్జెట్లో ఆస్తిపన్ను ఆదాయంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. రెవెన్యూ విభాగం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను ద్వారా రూ. 2,200 కోట్లు, ట్రేడ్ లైసెన్స్ రుసుము ద్వారా రూ. 115 కోట్లు, ప్రకటనల రుసుము ద్వారా రూ. 50 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, నగర ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతుల రుసుము ద్వారా రూ. 1,200 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పద్దు రూ. 8,440 కోట్లు ఉండగా.. రాబోయే ఆర్థిక సంవత్సరం పద్దు సుమారు రూ. 8,600 కోట్లు వరకు ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa